గుంటూరు : తెనాలి మండలం పరిధిలోని ఓ గ్రామంలో అనుమానిత వ్యాధి ప్రజలను భయపెడుతున్నది. ఇప్పటికే ఓ 14 ఏండ్ల బాలికను బలిగొనగా.. పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతలో దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. కొందరిలో గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనే అనుమానిత వ్యాధి లక్షణాలు కనిపించగా.. మరికొందరిలో తీవ్ర డయేరియా లక్షణాలు బయటపడ్డారు. దాంతో గ్రామంలో 25 పడకలతో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు అత్యవసర వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అధికారులను ఆదేశించారు.
తెనాలికి సమీపంలోని కొలకలూరు గ్రామంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గొరికిపూడి శ్రీనిధి అనే 14 ఏండ్ల బాలిక వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది పరిస్థితి విషమంగా మారడంతో.. ఆమెను తెనాలి ప్రభుత్వ దవాఖానా తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కాగా, ఇదే లక్షణాలతో పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరి అస్వస్థతకు కారణాలు తెలియరాలేదు. 30 మంది సిబ్బందితో కూడిన అత్యవసర వైద్య బృందాన్ని గ్రామానికి పంపించామని, పరిస్థితి అదుపులో ఉన్నదని మంత్రి విడదల రజిని తెలిపారు. కాగా, కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జీ రాజకుమారి, డీఎంహెచ్ ఓ శోభారాణి గ్రామానికి చేరుకుని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ 25 పడకలతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించేలా చూశారు.
ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటి వెళ్లి సర్వే చేపడుతున్నారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధితులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, తెనాలి సబ్ కలెక్టర్ నిధిమీనాలు పరామర్శించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. పైపుల ద్వారా నీటి సరఫరా నిలిపివేసి ఇంటింటికీ ట్యాంకర్లు, వాటర్ క్యాన్ల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారికి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని వైద్యులు సూచించారు. డ్రైనేజీ పైపులను మార్చేందుకు త్వరలో పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.