నంద్యాల జిల్లా : నిధులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నమనే విషయాన్ని ఓ సర్పంచ్ ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం కనీసం వీధి లైట్లు కూడా రిపేర్ చేయించుకోలేకపోతున్నామని తమ బాధను వ్యక్తం చేశారు. ఈ మేరకు నంద్యాల పర్యటనలో సీఎం జగన్ను కలిసిన మీర్జాపురం గ్రామ సర్పంచ్ బీ మహేశ్వర్రెడ్డి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలోని పంచాయతీలు నిధులు లేక నీరసించిపోతున్నాయని, ఎలాంటి అభివృద్ధి చేపట్టలేకపోతున్నాయని నంద్యాల జిల్లా సర్పంచ్ల సంఘం సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చింది. 14, 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో వీధి లైట్లను కూడా రిపేర్ చేయించుకోలేకపోతున్నామని జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి జిల్లా సర్పంచుల తరపున సీఎంకు తెలిపారు.
ఏపీలో దాదాపు 90 శాతం గ్రామ పంచాయతీల్లో వైసీపీకి చెందిన వారే సర్పంచులుగా విజయం సాధించారని, అయినప్పటికీ సరైన మొత్తంలో నిధులు అందకపోవడంతో చిన్నచిన్న పనులు చేయించలేకపోతున్నట్లు మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, పాత బిల్లులు కూడా చెల్లించేలా చర్యలు తీసుకొంటే కొత్త పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని తన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే పంచాయతీలకు నిధులకు విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు.