అమరావతి : విశాఖపట్నంలోని రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలకు సుప్రీంకోర్టు బ్రేక్ చెప్పింది. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసింది . రుషికొండ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ ఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, పిటిషన్ వేకేంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఇరువర్గాల వాదానలు ఇవాళ జరిగాయి. గతంలో ఉన్న రిసార్టు ప్రాంతంతో పాటు మరికొంత విస్తరిస్తున్నామని, 190 వృక్షాలే ప్రభుత్వం తీసివేసిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన వాదనను ధర్మాసనం విభేదించింది.
గతంలో రిసార్టు ఎంతవరకు ఉందో అంతవరకే నిర్మాణాలు జరగాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. సుప్రీంకోర్టులో చెప్పిన విషయాలన్నీ హైకోర్టు కూడా చెప్పాలని స్పష్టం చేసింది . హైకోర్టు వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుందని వెల్లడించింది . అవకాశం ఉన్నంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచిస్తున్నామని పేర్కొంది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని వేరే ఎక్కడా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది.
హైకోర్టు తదుపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని, హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎలాంటి క్లెయిమ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని సుప్రీంకోర్టు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు నమోదు చేస్తున్నామని, అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని అభిప్రాయపడింది .