తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అవతార మహోత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు రావడంతో తిరుచానూరు భక్తులతో నిండిపోయింది.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తోమాల సేవ నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7 నుంచి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్ను కూల్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు (ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత సుందరరాజస్వామికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రంనాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తున్నది.