తిరుపతి జిల్లా : శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుధ నారాయణమూర్తి మంగళవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూ, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను చూశారు. గుండె ఆపరేషన్ కోసం వచ్చిన బంగ్లాదేశ్, కోల్కతా ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నారని, దవాఖాన కార్పొరేట్ స్థాయి కంటే బాగా ఉన్నదని సంతోషం వ్యక్తం చేశారు.
పద్మావతి హార్ట్ సెంటర్ను ప్రారంభించిన 6 నెలల్లోనే 500 కు పైగా గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించామని, వారం వయసున్న పిల్లలకు కూడా విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశామని సుధ నారాయణ మూర్తికి టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి వివరించారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రూ.20-25 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నామన్నారు. జేఈఓ వీరబ్రహ్మం, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు .
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని, ఇదీ భారతదేశం గొప్పదనమని శ్రీమతి సుధ నారాయణ మూర్తి చెప్పారు. బంగ్లాదేశ్ డాఖాకు చెందిన మహమ్మద్ అబుల్ కసన్తో ఆమె మాట్లాడారు. ఐదేండ్ల వయసున్న తన కూతురు ఫహీబాకు గుండెలో రంధ్రం ఏర్పడి తీవ్ర అరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, గూగుల్లో సెర్చ్ చేసి తిరుపతి వచ్చామని చెప్పింది. ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది చాలా మంచి సేవలు అందిస్తున్నారని వారు కొనియాడారు.