విజయవాడ: సమాజంలోని అన్ని రంగాల్లో పోటీ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో తమ తమ రంగాల్లో నైపుణ్యాన్ని సముపార్జించుకుని, క్రమశిక్షణతో, ఇష్టపడి కష్టపడడం ద్వారా విజయాలు సొంతం చేసుకోవచ్చునని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు యువతకు దిశానిర్దేశం చేశారు. యువత ఉన్నతమైన కలలతో, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో నైపుణ్యాన్ని సాధించడం ద్వారా అంతర్జాతీయంగా అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు. విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో గురువారం ఉపరాష్ట్రపతి ముఖాముఖి జరిపారు.
యువత ఉపాధి కోసం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. వివిధ రంగాల్లో అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించడం ద్వారా వారికి బంగారు భవిష్యత్ను అందించడమే గాక, స్వయం ఉపాధి ద్వారా సొంత కాళ్ళ మీద నిలబడేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ రంగం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివక్షకు తావులేని భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.
కార్యక్రమానికి ముందు విజయవాడకు చెందిన ఔత్సాహిక నృత్యకళాకారిని ఏల్చూరి స్నేహశర్మ నాట్యాన్ని ఉపరాష్ట్రపతి తిలకించారు. ఆమె ప్రదర్శించిన శ్రీ విఘ్నరాజమ్ భజే, త్రిపుర సంహారం, కాళీయ మర్ధనం ఘట్టాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఇతర ట్రస్టీలు, శిక్షణార్ధులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి వెంకయ్యనాయుడు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు.