అల్లూరి మన్యం జిల్లా: ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ఇప్పుడు మన్యం ప్రాంతాలకు కూడా విస్తరించింది. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఇప్పటివరకు మనం చూశాం. మారుమూల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనైతే ర్యాగింగ్ అంటే అర్ధం కూడా తెలియదు. అట్లాంటి స్కూళ్లో ర్యాగింగ్ జరగడం.. సీనియర్ల చేష్టలకు ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖాన చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళితే.. అల్లూరి సీతారామారాజు మన్యం జిల్లాలోని తలరసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో ర్యాగింగ్ జడలు విప్పింది. పదో తరగతి విద్యార్థులు తమకన్నా చిన్న వారిని ర్యాగింగ్ పేరుతో వేధించారు. స్కూళ్లో లీడర్షిప్ చేస్తున్నారన్న అక్కసుతో.. ఎక్కువగా ఉప్పు కలిపిన ఆహారాన్ని 9 వ తరగతి విద్యార్థులతో బలవంతంగా తినిపించారు. దాంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెంటనే వారిని పాడేరులోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ముగ్గురు విద్యార్థులు బలవంతంగా వారితో ఉప్పు ఎక్కువగా కలిపిన అన్నం, కూరలను తినిపించడం వల్లనే వారు అస్వస్థతకు గురయ్యారని ఉన్నతాధికారులకు వార్డెన్ సమాచారమిచ్చారు.
ఈ విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హుటాహుటిన దవాఖానకు వచ్చి అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించారు. ఎలా అస్వస్థతకు గురయ్యారో వారిని అడిగి తెల్సుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లో ఇలాంటి సంఘటన జరుగడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని ఈశ్వరి చెప్పారు. ఈ ర్యాగింగ్ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.