తిరుపతి : ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, చక్కటి ప్రణాళికతో లక్ష్యాలను సాధించుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. లక్ష్యాలను అనుగుణంగా కష్టించడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకోవచ్చున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.
విద్యార్థులు లక్ష్యాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలని, జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరాశ చెందకూడదని ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అకుంఠిత దీక్ష, శ్రమతో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చన్నారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన..’ అనే పద్యాన్ని విద్యార్థులకు విడమర్చి చెప్పారు. ఉదాహరణగా ఏకలవ్యుడి కథను వినిపించారు. అలాగే, భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఉదహరించారు. మంచిస్థాయికి ఎదిగేందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. భగవంతుడి కన్నా ముందు మన తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలని, మన భవిష్యత్కు మార్గనిర్దేశనం చేసేది తల్లిదండ్రులు, గురువులు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
అనంతరం కళాశాలలోని వివిధ పరిశోధనశాలల్ని ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. కళాశాల వెనుక భాగంలో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాశాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, తగినంతమంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని జేఈఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారి గోవిందరాజన్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.