అమరావతి : రేపు జరుగనున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం రెండు లక్షల 13 వేల338 మంది ఓటర్లకు గాను 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1132 మంది ఎన్నికల సిబ్బందిని, అధికారులను నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. 38 సెక్టార్లకు రూట్ మొబైల్ టీంలు ఉంటాయని, మండలానికో స్ట్రైకింగ్ ఫోర్స్ తిరుగుతుందని వివరించారు. బాడీ ఓన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు.
అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని అన్నారు. ఇప్పటి వరకూ రూ.47 లక్షలను స్వాధీనం చేసుకొన్నామని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు . కాగా ఇవాళ ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలీంగ్ కేంద్రాలకు బయలు దేరారు. పలు పోలింగ్ సామగ్రి పంపణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు పరిశీలించారు. కొవిడ్ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు ఉపఎన్నికల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ పోటీలో 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అధికార వైసీపీ తరఫున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ తరఫున భరత్కుమార్ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్నాయి.