శ్రీబాలాజీ జిల్లా : తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు రావాలని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి అభిలాషించారు. ఇందుకోసం అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్బీఏ బృందం జూలై చివరి వారంలో కళాశాలను సందర్శించనున్నదని, ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, ఇతర విభాగాల పనులను వేగంగా చేపట్టాలని ఆమె సూచించారు. కళాశాలలో మౌళిక వసతులను మరింతగా మెరుగుపరచాలన్నారు.టీటీడీ పరిపాలనా భవనంలో కళాశాలల ప్రిన్సిపాల్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్షించారు.
కళాశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, ప్రహరి గోడకు పెయింటింగ్, సూచిక బోర్డుల ఏర్పాటు, కళాశాలలో ఐటి తరగతి గదులు, ల్యాబ్ల ఆధునీకరణ, పచ్చదనం పెంపొందించడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యను అభివృద్ధి పరచడం కోసం రెగ్యులర్ పాఠశాలలకు మాన్ స్క్రిప్ట్స్ విభాగం డిప్యూటీ ఈఓ శ్రీమతి విజయలక్ష్మి, ప్రత్యేక ప్రతిభా వంతుల పాఠశాలలకు శ్వేత డెరెక్టర్ శ్రీమతి ప్రశాంతిని ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు తెలిపారు. టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను మరింత అభివృద్ధి పరచే దిశగా కృషి చేయాలన్నారు. టీటీడీ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్లు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక అందజేయాలన్నారు.
డీఈఓ గోవిందరాజన్, డీఎఫ్ఓ శ్రీనివాస రెడ్డి, డీఈ (ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి, ఈఈలు మనోహర్, మురళీకృష్ణ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అసుంత, ఎన్బీఏ కోఆర్డినేటర్ శ్రీమతి పద్మావతి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.