హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఏపీలోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలకేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్యపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. కృష్ణయ్య వీపుకు రాయి తగిలింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్ బీసీలకు చేస్తున్న మేలును చూసి ఓర్వలేక తనపై దాడి చేశారని మండిపడ్డారు. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ జగన్వైపు ఉన్నారని తెలిపారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 40 ఏండ్లుగా నిరంతరం కృషి చేస్తున్న కృష్ణయ్యపై దాడిచేయడం అమానుషమని, దీనిని ఖండిస్తున్నామని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు పేర్కొన్నారు.