తిరుమల : టీటీడీ పరిధిలో ఏర్పడే వరదలు లాంటి ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి వీలుగా టీటీడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రెండో ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను జనవరి 10వ తేదీలోపు పూర్తి చేసి భక్తుల వాహనాలను అనుమతించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఘాట్ రోడ్డు పనులను సోమవారం పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జిల్లాస్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని, విపత్తులు వాటిల్లినపుడు చేపట్టాల్సిన చర్యలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపి) తయారు చేయాలని సూచించారు. ఈ టీమ్ ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ టీటీడీ యాజమాన్యానికి తెలియజేయాలని అన్నారు. అటవీ, ఆరోగ్య, ఇంజినీరింగ్, నిఘా, భద్రత తదితర విభాగాలను అప్రమత్తం చేయాలని కోరారు. ఈ టీమ్ 15 రోజుల్లోపు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని, విభాగాల వారీగా చేపట్టాల్సిన బాధ్యతలను రూపొందించాలని సూచించారు.
తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దశలవారీగా ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ప్యాకింగ్ మెటీరియల్, బొమ్మలను తిరుమలకు దూరం చేయాలన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు స్థానిక వ్యాపారులతో ఒక సమావేశం నిర్వహించాలని కోరారు.