అమరావతి : పాల ఉత్పత్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని ఈనెల 27,28వ తేదీల్లో ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది . 27న గ్రామ స్థాయిలో పాల కేంద్రాల వద్ద, 31 న పాల అమ్మకాల కేంద్రాల వద్ద నిరసన చేపడుతున్నట్లు వెల్లడించింది. కేరళ రాష్ట్రం మాదిరిగా రెండు ఆవులు, గేదెల పెంపకం ద్వారా రోజుకు 10 లీటర్ల చొప్పున 100 రోజులు పాలు పోసే కుటుంబానికి రూ. 34 వేలు చెల్లించే పట్టణ ఉపాధి పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లీటరుకు రూ.4 ను పాల రైతులకు అందజేయాలని కోరారు. కేరళ తరహాలో అసెంబ్లీలో జీఎస్టీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు రౌండ్టేబుల్ సమావేశంలో రైతు నాయకులు నిరసనలకు పిలుపునిచ్చారు.