విజయవాడ: రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాజధాని ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని విడనాడాలన్నారు. రాయలసీమవాసులుగా తామెంతో బాధపడుతున్నప్పటికీ అమరావతిని రాజధానిగా చేసేందుకు అండగా నిలిచామని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకోసమో సీఎం జగన్ వెల్లడించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
శ్రీభాగ్ ఒప్పందంపై ముఖ్యమంత్రి జగన్కు కనీస అవగాహన లేదని, అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్కే మంచిదని శైలజానాథ్ చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ ఎప్పుడు కూడా ప్రజల్లో, రోడ్ల మీద తిరగలేదని, అలా తిరిగితే ఆయన రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు తెలిసేవన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయిస్తూ అదే పరిపాలన అని భ్రమలో సీఎం జగన్ ఉన్నారని దుయ్యబట్టారు. ఆనాడు అమరావతికి జైకొట్టిన జగన్.. ఇవాళ మూడు రాజధానుల మాటెత్తడం ఎందుకో స్పష్టం చేయాలన్నారు. మూడు రాజధానుల ప్రకటన కేవలం ప్రజల మధ్య విద్వేషాల కోసమే అని అభిప్రాయపడ్డారు. ఇకనైనా జగన్ తన మొండి పట్టుదలను వీడి అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని హితవు పలికారు.