అమరావతి: కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లాపై సమీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 28 మధ్య నాలుగు రోజుల పాటు సమీక్షా సమావేశాలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ విజయవాడలో నాలుగు జిల్లాల కలెక్టర్లు సమీక్ష జరిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, అభిప్రాయలను తెలిపేందుకు ప్రభుత్వం వచ్చే నెల 3 వరకు గడువిచ్చింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 జిల్లాల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవగా.. మరికొన్ని చోట్ల నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కొత్త జిల్లాలపై 1478 అభ్యంతరాలు, అభిప్రాయాలు అందినట్లు సమాచారం. అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా 700 లేఖలు అందగా.. అతి తక్కువగా శ్రీకాకుళం నుంచి 16 వినతిపత్రాలు వచ్చాయి. ఉగాది నుంచి పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, అభిప్రాయాలను సమీక్షించేందుకు ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు. 13 జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు జరుగుతాయి. 23 న విజయవాడలో కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, 24 న తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లు, 26 న అనంతపురంలో అనంతపురం, కర్నూలు కలెక్టర్లు, 28 న విశాఖలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.
వచ్చే నెల 10 న తుది నోటిఫికేషన్: విజయ్కుమార్
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి విజయ్కుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్వివ్యవస్థీకరణకు ఇప్పటికే గ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, మార్చి 3 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని సూచించామని తెలిపారు. మార్చి 10 లోపు కొత్త జిల్లాలపై ప్రభుత్వానికి నివేదిక అందుతుందని, అదే రోజు తుది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఉద్యోగులను ఇప్పటికిప్పుడు విభజన చేయట్లేదని, తాత్కాలిక కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఆమోదం వచ్చాక ఉద్యోగుల జోనల్ విభజన చేపడతామన్నారు.