అమరావతి : నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ (SSLV-D3 Rocket ) ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలయ్యింది. శుక్రవారం షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం ఉదయం 9.17 గంటలకు నింగిలోకి లాంచ్ చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chairman) తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్న ఈఓఎస్ -08 శాటిలైట్ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని వివరించారు. ఇందు కోసం ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రయోగించనున్న రాకెట్ల వివరాలను వెల్లడించారు. నవంబర్లో గగన్యాన్ రాకెట్, నావిక్ శాట్ ప్రయోగం చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందని అన్నారు. నాసా వారి నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎం కె3, ఎల్వీఎం 3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు వివరించారు. మరో ఏడాదిలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.