తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు(Salakatla Vasantotsavam) అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు వెల్లడించారు.
ఏప్రిల్ 3న ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగుతారని అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారని తెలిపారు. . ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారని వివరించారు. ఏప్రిల్ 4న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారన్నారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారని వెల్లడించారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడిందన్నారు.
ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవం లో ప్రధాన ప్రక్రియని వెల్లడించారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం(Kalyanotsavam), ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Brahamotsavam), సహస్రదీపాలంకార సేవలను టీటీడీ(TTD) రద్దు చేసింది.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.01 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 61,425 మంది దర్శించుకోగా 26,430 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.01 కోట్లు వచ్చిందన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు.