నెల్లూరు జిల్లా : శ్రీవేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైభవోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం ఉదయం నిర్వహించిన పుష్పయాగం సప్తవర్ణ శోభితంగా నిలిచింది. ఈ వేడుకకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వైభవోత్సవాలు టీటీడీ నిర్వహిస్తున్నది. సుగంధాల్ని వెదజల్లే రంగు రంగుల పుష్పాలు, పత్రాలతో ఈ పుష్పారాధన వేడుకగా జరిగింది. పుష్పార్చన జరుగుతుండగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి దివ్యమనోహర రూపాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇందులో భాగంగా అర్చకులు 108 సార్లు విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుడ్ని ప్రసన్నం చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకుంటూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాల్లో పుష్పయాగం నిర్వహిస్తారు.

ఉదయం 8.15 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం రెండు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. చివరగా నక్షత్ర హారతి ఇచ్చారు. అనంతరం టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుమల ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, జిల్లా ఎస్పీ విజయారావు, అదనపు ఎస్పీ శ్రీమతి హిమవతితోపాటు పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.