Srisailam | భగవత్పాదులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రం శ్రీశైలం అని కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. శుక్రవారం క్షేత్ర పరివార దేవతాలయాలైన హఠకేశ్వం, ఫాలధార పంచధార శారదా చంద్రమౌళీశ్వరులను దర్శించుకుని ఆదిశంకరాచార్యుల పాదపూజ చేసుకున్నారు.
అలాగే శ్రీశైలంలోని శ్రీదేవి వేద విద్యాలయాన్ని సందర్శించి వేద విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలు, సంస్కృతం, వేదం, శాస్త్రీయ విద్యలు, సంగీతం, జాతకం, శతకములతోపాటు ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం గురించి కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వివరించారు. ఆదిశంకరులకు శ్రీశైల క్షేత్రంతో గల అవినాభావ సంభందాన్ని తెలియజేశారు.
ఈఓ పెద్దిరాజుతో కలిసి కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శనీయం అని అన్నారు. కనుక భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి హిందువు తమవంతు కృషి చేయాలని అన్నారు. దేవస్థానం నిర్వహించిన మహా కుంభాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించడంతో లోక కళ్యాణం జరుగుతుందని అన్నారు.
అదే విధంగా ప్రతి ఇంటా గోమాతను పూజించడం సకల శుభాలను కలిగుతుందని కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. శివాజీ సూర్తికేంద్రాన్ని సందర్శించిన పీఠాధిపతి కేంద్ర నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో వేదపాఠశాల మేనేజర్ రామకృష్ణ, వంశీ, లీగల్ అడ్వైజర్ గిరిధర్ తదితరులు ఉన్నారు.