Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో అన్యమత బోధనలకు సంబంధించిన కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేయడం నిషేధమని తేల్చి చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. భక్తుల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ ఆలయ పవిత్రతను కాపాడటం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీయడం, డ్రోన్స్ ఎగురవేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు, రీల్స్, ఫొటోలు ప్రచారం చేయడానికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ చర్యలు భక్తుల ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేందుకు, ఆలయ వాతావరణం శాంతియుతంగా ఉండేందుకు తీసుకున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. ధూమపానం, మద్యపానం, జూదం ఆడడం, మాంసాహారం వినియోగం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల శ్రీశైలంలో ఓ యువతి రీల్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది కాస్త వివాదాస్పదంగా మారడంతో పాటు ఈ అంశం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన యువతి తాను తప్పుగా రీల్ చేయలేదని.. తప్పు జరిగిందని భావిస్తే క్షమాపణలు చెబుతున్నట్లు చెప్పింది. కొంతమంది తనను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు మరోసారి స్పందిస్తూ, భక్తులందరూ ఆలయ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరు హద్దులు దాటినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భక్తుల సహకారంతోనే ఆలయ నిర్వహణ సక్రమంగా సాగుతుందని, అందరూ అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.