శ్రీశైలం: కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి భారీగా పెరుగుతున్నది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో గురువారం సాయంత్రం డ్యాం పది గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు గేట్లద్వారా 2,22,683, విద్యుదోత్పత్తి ద్వారా 30,635, సుంకేశుల నుంచి 1,74,150, హంద్రీ ద్వారా 250 క్యూసెక్కుల ( మొత్తం 4,28,078 క్యూసెక్కులు ) నీరు శ్రీశైలానికి విడుదల చేయగా, సాయంత్రం వరకు 4,26,201 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే, పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తులో తెరిచి 3,76,670, కుడి ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 62,091 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్ధాయి నీటిమట్టం 885, పూర్తిస్ధాయి నీటి నిల్వలు 215.807 టీఏంసీలకుగానూ 884.40 అడుగుల వద్ద 211.9572లుగా నమోదైంది.