Srisailam | ఈ నెల 16 నుంచి 21 వరకు శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే మహా కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ పెద్దిరాజు తెలిపారు. ఈ మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం- దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను దేవస్థానం సహాయ ఈఓ ఐఎన్వీ మోహన్, అర్చక స్వాములు ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సత్యనారాయణకు వేద ఆశీర్వచనంతో శేష వస్త్రాలు, ప్రసాదం అందజేసినట్లు ఈఓ పెద్దిరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే జవహర్ రెడ్డిలకు కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆహ్వానం అందజేసిన వారిలో దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఈఓ పెద్దిరాజు, సహాయ ఈఓ ఐఎన్వీ మోహన్ తదితరులు ఉన్నారు.