Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగుతున్నది. కార్తీకమాసం ఆఖరి వారం కావడంతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు సోమవారం తెల్లవారు జామునే తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించి, పూజలు చేసుకొన్నారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం, అతి శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దర్శన అనంతరం బయటకు వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయం వెనుక భాగంలో కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు.
కార్తీకమాసం ఆఖరి రోజులు కావడంతో ఒక్కసారిగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. క్షేత్ర వలయ రహదారి వరకే వాహనాలను అనుమతించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా అందరికీ స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. గురువారం నుండి ఆర్జిత సేవా టిక్కెట్లు, గర్బాలయ దర్శనాలు యధావిధిగా అందుబాటులో కొనసాగుతాయని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ వల్ల క్షేత్ర దర్శనానికి వచ్చే వారు ముందుగా ఆన్లైన్ ద్వారా వసతి ఏర్పాట్లు సమకూర్చుకోవాలని ఈవో పెద్దిరాజు సూచించారు.