Srisailam | ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10వ తేదీ వరకూ శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది ఉత్సవాల నిర్వహణ కోసం శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి ఈఓ డీ పెద్ది రాజు ఆదివారం పలు చోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి.. అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. యాంపీ థియేటర్, మల్లమ్మ కన్నీరు, పలు ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, రింగ్ రోడ్డు తదితర ప్రాంతాలను ఈఓ పెద్దిరాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈఓ డీ పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాల సందర్భంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉత్సవాల ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుండాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధిపతులు (యూనిట్ అధికారులు), పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తమ విభాగం సిబ్బందిని సమన్వయ పరుస్తూ ఆయా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కనబర్చాలని చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఇప్పటికే పలుచోట్ల చలువ పందిళ్లు (పైప్ పెండాల్స్) వేసింది. ఆయా చలువ పందిళ్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు.. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో భక్తులు సేద తీరడానికి ఆరు బయలు ప్రదేశాల్లో ఇంకొన్ని చలువ పందిళ్లు వేయాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో కంటే ఎక్కువగా.. మరిన్ని అదనపు ప్రదేశాల్లోనూ, ముఖ్యంగా యాంపీ థియేటర్ వద్ద విశాలమైన ఆరు బయలు ప్రదేశాల్లో ఈ చలువ పందిళ్లు ఉండాలని చెప్పారు.
చలువ పందిళ్ల వద్ద ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం మంచినీటి సరఫరా ఉండాలని ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు. అదే విధంగా తగిన లైటింగ్ వసతులు కల్పించాలని తెలిపారు. ట్యాంకర్లతోపాటు వాటర్ ప్యాకెట్ల రూపంలోనూ తాగునీరు పంపిణీ చేపట్టాలని సూచించారు. క్షేత్ర పరిధిలో పలుచోట్ల అన్నదానం చేస్తున్న స్వచ్చంద సేవా సంస్థలకు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా అన్నదాన ప్రదేశాలకు సమయానుకూలంగా మంచినీటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. తగిన రీతిలో లైటింగ్ వసతులు కల్పించాలని తెలిపారు.
అలాగే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా కొనసాగిస్తుండాలని ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు. చలువ పందిళ్లు, ప్రధాన కూడళ్లు, ఉద్యానవనాలు, అన్నదాన ప్రదేశాలతోపాటు క్షేత్ర పరిధిలోని అన్ని చోట్ల ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని అన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను డంప్ యార్డుకు తరలించడానికి అదనంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. శౌచాలయల వద్ద శుభ్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. శౌచాలయాలకు నిరంతరాయంగా నీటి సరఫరా ఉండాలని చెప్పారు.
యజ్ఞ వాటిక వద్ద పార్కింగ్ ప్రదేశాల్లో బస్సులు నిలిపేందుకు రీజియన్లు, డివిజన్ల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈఓ డీ పెద్దిరాజు అన్నారు. దీనివల్ల ప్రాంతాల వారీగా, క్రమ పద్దతిలో బస్సులు నిలిపే అవకాశం ఉంటుందన్నారు. వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా దుకాణ దారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని రెవెన్యూ విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకృష్ణ, ఇన్ చార్జీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీవీ సుబ్బారెడ్డి, చంద్రశేఖర శాస్త్రి, సహాయ ఇంజినీర్లు రాజేశ్వరరావు, రంగ ప్రసాద్, భవన్, ప్రణయ్, మేఘనాథ్, ఉద్యానవన అధికారి లోకేశ్, విశ్రాంత ఉద్యానవన అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.