Srisailam-Sravanam | శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత వసతి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో ఎస్ లవన్న గురువారం పాతాళ గంగ, కల్యాణ కట్ట, డార్మెటరీలు, పాతాళేశ్వర సదన్, మల్లికార్జున సదన్, గంగా-గౌరి సదన్ల వద్ద వసతి ఏర్పాట్లను పరిశీలించారు.
వివిధ విభాగాల అధికారులతో కలిసి ఈవో లవన్న తొలుత పాతాళ గంగ మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. వేకువ జాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పారు. కనుక మెట్ల మార్గంలో తగినంత లైటింగ్ వసతులు కల్పించాలని, మెట్ల మార్గం రైలింగ్కు పెయింటింగ్ వేయాలని ఆదేశించారు.
భక్తుల అవసరాలకు అనుగుణంగా పాతాళ గంగలో మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిక్ విభాగం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పాతాళ గంగ వద్ద గల బ్యారికేడ్లను పర్యవేక్షిస్తుండటంతోపాటు నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పాతాళ గంగ వద్ద గల శౌచాలయాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించారు.
శౌచాలయాల వద్ద శుభ్రత పట్ల నిరంతరం శ్రద్ధ వహించాలని సిబ్బందికి ఈఓ లవన్న చెప్పారు. స్నాన ఘట్టాలు, వాటి పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా తగు పర్యవేక్షణ చేయాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. పాతాళ గంగ వద్ద విధులు నిర్వర్తించే ఈత నిపుణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
పాతాళ గంగ వద్ద అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఈఓ లవన్న అన్నారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు సబ్బులు, షాంపులు వాడటం వల్ల నీరు కలుషితం అవుతుందని చెప్పారు. కనుక షాంపులు, సబ్బులు వాడకుండా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అటుపై పాతాళేశ్వర సదన్ను ఈవో లవన్న పరిశీలించారు. పాతాళేశ్వర సదన్ అతిథి గ్రుహ ఆధునీకరణకు తగు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. పాతాళ గంగ మార్గంలోని డార్మెటరీలను పరిశీలించిన ఈఓ లవన్న.. డార్మెటరీల్లో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సజావుగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు తగిన విధంగా తనిఖీలు చేస్తూ ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
కల్యాణకట్ట వద్ద పనులను ఈఓ లవన్న పరిశీలించారు. భక్తుల కేశ ఖండన సమయంలో శుచీ శుభ్రతలను పాటించాలని క్షురకులకు సూచించారు. కేశ ఖండనకు వచ్చిన భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి, క్షురకులకు సూచించారు. ఎప్పటికప్పుడు కల్యాణకట్టను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
తదుపరి మల్లికార్జున సదన్, గంగా-గౌరీ సదన్లను ఈఓ లవన్న పరిశీలించారు. వసతి గదుల్లో ఏసీ, ఫ్యాన్లు, గీజర్లు సజావుగా పని చేసేలా రోజువారీగా పర్యవేక్షించాలని వసతి విభాగం అధికారులను ఆదేశించారు. ఆయా వసతి గదుల్లో అవసరమైన మరమ్మతులు ఆలస్యం చేయకుండా చేపట్టాలని హితవు చెప్పారు. ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈవో లవన్నతోపాటు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం హరిదాసు, శ్రీనివాస రెడ్డి, సూపర్ వైజర్లు మల్లికార్జున రెడ్డి, శివ ప్రసాద్, అయ్యన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఐ/సీ) చంద్రశేఖర శాస్త్రి, నీటి సరఫరా విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ రాజేశ్వరరావు, సివిల్ అసిస్టెంట్ ఇంజినీర్ సీతా రమేశ్ తదితరులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు.