Srisailam | శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం ఈవో లవన్న.. అతిధులకు ఆహ్వాన పత్రాలు అందచేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరై శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ మేరకు సోమవారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, జిల్లా ఎస్పీ రఘువీరారెడి, జాయింట్ కలెక్టర్ నిశాంతి, అదనపు కలెక్టర్ రమణ తదితరులకు ఆహ్వాన పత్రాలు అందించామని ఈవో తెలిపారు. వారికి లడ్డూ ప్రసాదాలు, శేష వస్త్రాలు సమర్పించినట్లు చెప్పారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాదయాత్ర ద్వారా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు.
సోమవారం హఠకేశ్వరాలయం నుండి అటవీ ప్రాంతంలో ఉండే కైలాస ద్వారం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు శివస్వాములకు ప్రత్యేకంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనంతోపాటు పాలు, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశామని ఈవో లవన్న చెప్పారు.
వివిధ ప్రాంతాల నుండి పాదయాత్రతో యాత్రికుల కోసం చేపట్టిన అన్నప్రసాద వితరణకు దాతలు తమ వంతు సహకారం అందించాలని ఈవో లవన్న కోరారు. వస్తు రూపంలో గానీ, విరాళాల రూపంలో సహకారం అందించాలని కోరారు. అన్నదాన కార్యక్రమంలో శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్, ఈఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తెలంగాణ ప్రాంత భక్తులు విరాళాలందించారు. మంచిర్యాల వాసి శివకుమార్ దంపతులు రూ. లక్ష, హైదరాబాద్ వాసి వెంకటేశ్ రెడ్డి దంపతులు రూ.లక్ష, నంద్యాల వాసి రాజేష్ కుటుంబం రూ.లక్ష విరాళం అందజేశారు. కేరళ రాష్ట్ర వాసి చాగంటి కమల సింధు రూ. లక్ష విరాళం అందజేశారు. దాతలు సోమవారం ఏఈవో ఫణీంద్రప్రసాద్కు చెక్లు, డీడీల రూపంలో తమ విరాళాలు అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.