Srisailam | శ్రీశైలంలో నిర్వహిస్తున్న అన్ని సత్రాలు కూడా సేవాదృక్పథంతో భక్తులకు సేవలు అందించాలని దేవస్థానం కార్య నిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, భక్తుల సదుపాయాల కల్పనలో అన్ని సత్రాల వారు కూడా సహకరించాలని కోరారు. మంగళవారం ఆయన స్థానిక సత్రాల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. వసతుల కల్పనలో సత్రాలకు దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి సత్రం వారు కూడా శుచీ శుభ్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సత్ర ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సత్రాలు వారు కూడా తగినంత మేరకు చెత్తకుండీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సత్ర ప్రాంగణాలతోపాటు పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉండేందుకు అన్ని సత్ర యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
శ్రీశైల క్షేత్రంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతున్నదని శ్రీనివాసరావు తెలిపారు. ఆయా సత్రాలలో బస చేసే వారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా అన్ని సత్రాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చాలా సత్రాలలో బసచేసేవారు ఎక్కువగా వారి వాహనాలను రహదారుల పైనే పార్కింగ్ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. కనుక సత్రాల యాజమాన్యాలు వాహన పార్కింగ్ విషయంలో తగు బాధ్యతలు తీసుకోవాలన్నారు.
ఆయా సత్రాలలో బస చేసే వారికి వాహన పార్కింగ్ విషయమై సత్రాల యాజమాన్యాలు తగిన అవగాహన కల్పించాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు మాట్లాడుతూ వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అన్ని సత్రాల యాజమాన్యాలు కూడా ముందస్తుగానే నీటి ట్యాంకులలో నీటిని నిల్వచేసుకోవాలన్నారు. ఇందుకు తగిన మేరకు నీటి ట్యాంకులు ఏర్పాటు ఉండాలన్నారు. అవసరాలకు తగినట్లు దేవ స్థానం నీరు సరఫరా చేస్తుందన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం ఇంజనీరింగ్, వసతి, పారిశుద్ధ్యం, భద్రతా విభాగం అధికారులు పాల్గొన్నారు.