Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే ఉగాది మహొత్సవాల సందర్భంగా యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారి గర్బాలయ, ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పది రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. గురువారం నుంచి ఈ నెల 23 వరకు రోజుకు నాలుగు విడతలుగా స్వామి అమ్మవార్ల అలంకార, స్పర్శ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికుల సంఖ్య అధికంగా ఉంటుందని, ప్రతి భక్తునికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
అదే విధంగా అమ్మవారి ఆలయంలో జరిపించే శ్రీచక్ర కుంకుమార్చనలు కూడా ప్రాకార మండంపంలో మాత్రమే చేయనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఉగాది బ్రహ్మోత్సవాల్లో రోజుకు 60-80 వేల మంది క్షేత్ర దర్శనానికి రానున్నారని చెప్పారు. కనుక లఘు దర్శనాలకు అధిక ప్రాధాన్యం కల్పించడంపై కర్ణాటక, మహారాష్ట్ర భక్త సంఘాలు, పాదయాత్ర బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశాలు జరిపి అవగాహన కలిగించినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఈ అంశాలను గమనించి దేవస్థానం సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న కోరారు.