Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది యాత్రికులు కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారు జామున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలతో దీప దానాలు చేసుకున్నారు.
స్వామి అమ్మవార్ల దర్శనం కోసం కంపార్టుమెంట్లలో వేచి ఉన్న యాత్రికులకు ఉచిత క్యూలైన్ ద్వారా నాలుగు గంటల సమయం పట్టగా శీఘ్ర, అతిశీఘ్ర ప్రత్యేక క్యూలైన్ల ద్వారా రెండు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఆర్జిత సేవాకర్తలకు నిర్ణీత సమయాల్లో అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించినట్లు ఏఈవో హరిదాసు తెలిపారు.
ఆర్జిత సేవలకు భక్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లను పొందాలని ఏఈవో హరిదాసు చెప్పారు. సాయంత్రం కళారాధన వేదికపై హైదరాబాద్కు చెందిన అభినయ కూచిపూడి కళాక్షేత్రం బృందం ఆధ్వర్యంలో సంప్రదాయ గీతాలకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే యాత్రికులు సాక్షి గణపతి ఆలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపి వేస్తున్నారు. అక్కడి నుంచి ఆలయ దర్శనానికి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి. కనుక యాత్రికులు తోటి వాహన దారులకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు కోరారు.