Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శుక్రవారం మధ్యాహ్నం పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఎస్వీ నాగేశ్వర్ రావు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుక్కుల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయం ప్రకారం దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, అధికారులు, వేద పండితులు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. తర్వాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటుపై శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బందిని మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేయించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్తాలను సమర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి కార్యనిర్వహణాధికారి సంబంధం గురుక్కుల్ మాట్లాడుతూ శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. మహా శివరాత్రి పర్వదినాల్లో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇది తమకెంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు.