తిరుపతి : తిరుపతి శ్రీకోదండరామస్వామి(Kodanda ramaswamy)వారి ఆలయంలో గురువారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 30న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుపనున్నామని తెలిపారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారని వివరించారు.
మార్చి 31 ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టీటీడీ(Ttd) పరిపాలనా భవనం నుంచి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారని పేర్కొన్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం(Kalyanam) వేడుకగా జరుగనుందని చెప్పారు. రూ.1000 చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చని సూచించారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారని వెల్లడించారు.
ఏప్రిల్ 1న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుంచి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారని అన్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.