తిరుమల : టీటీడీకి అనుబంధంగా ఉన్న వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టర్ కెహెచ్.రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శ్రీ సీతారామలక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అమరనాథరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్ రమణప్రసాద్, శ్వేత సంచాలకులు ప్రశాంతి పాల్గొన్నారు.