తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి తెప్పోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులు ఎక్కువగా రావడంతో తిరుచానూరు కిక్కిరిసిపోయింది.
తెప్పోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు.
సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఆలయ అర్చకులు బాబుస్వామితోపాటు ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.