తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాతం, యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. అనంతరం ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహించినట్టు తెలిపారు. డిసెంబరు 4న గజవాహనం, 5న గరుడవాహనం, 8న పంచమితీర్థం, 9న పుష్పయాగం నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.