తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు అర్చకులు.
పాలకడలిని అమృతం కోసం మధించిన సమయంలో లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం.
ఆకలిదప్పుల్ని తొలగించి,పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలనూ నెరవేరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి గా విరాజిల్లుతుంది.