Srisailam | కార్తీక మాసంలో శ్రీశైలం మహాక్షేత్రానికి పుణ్య స్నానాల కోసం భారీగా భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో మహా క్షేత్రంలోని పాతాళ గంగ తదితర ప్రాంతాల్లో దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి లవన్న సోమవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు.
కార్తీక మాసం ప్రారంభమయ్యేలోపు పాతాళ గంగ వద్ద శౌచాలయాలు, భక్తులు దుస్తులు మార్చుకునే గదులకు మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాతాళ గంగ, దాని పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అనునిత్యం పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శౌచాలయాలు ఎల్లవేళలా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పాతాళగంగ, దాని పరిసరాల్లో ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తరుచుగా పరిశీలిస్తుండాలని ఇంజినీరింగ్ అధికారులకు లవన్న ఆదేశాలు జారీ చేశారు.
పాతాళగంగ వద్ద విద్యుద్దీపాలు పెంచి, విద్యుద్దీకరణ చేయాలని తెలిపారు. పాతాళ గంగ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
పాతాళ గంగలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నప్పుడు సబ్బులు, షాంపూలు వాడటం వల్ల నీరు కలుషితం అవుతుందని లవన్న ఆందోళన వ్యక్తం చేశారు. కనుక పాతాళ గంగలో స్నానాలు చేసే భక్తులు సబ్బులు, షాంపూలు వాడకుండా వారికి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
ఈ విషయం భక్తులకు తెలిసే విధంగా పాతాళ గంగ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.
పాతాళ గంగ మార్గంలోని డార్మెటరీలు, వాటిల్లోని శౌచాలయాలు, స్నానాల గదులకు కూడా లవన్న తనిఖీ చేశారు. శౌచాలయాలు, స్నానాల గదులకు నిత్యం నీటి సరఫరా చేసేందుకు తగ్గు చర్యలు తీసుకోవాలని దేవస్థాన నీటి పారుదల విభాగాన్ని ఆదేశించారు.
డార్మెటరీల వద్ద భక్తులతో మర్యాదగా ఉండాలని వాటి నిర్వాహకులను హెచ్చరించారు. ముఖ్యంగా డార్మెటరీల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగిస్తూ ఉండాలని అన్నారు.
శ్రావణ మాసం, కార్తీక మాసం ఉత్సవాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని లవన్న తెలిపారు. కనుక భక్తుల అవసరాలకు అనుగుణంగా డార్మెటరీల్లో శౌచాలయాలు, స్నానాల గదులను నిర్మించాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అందుకు అవసరమైన అంచనాలు రూపొందించి, పనులు చేపట్టాలన్నారు.
పాతాళ గంగ మార్గంలోని నందికేశ సదనంలో అదనపు స్నానపు గదులు, శౌచాలయాల నిర్మాణం చేపట్టారు. వాటి పురోగతిని లవన్న పరిశీలించారు. సకాలంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారును ఆదేశించారు.
నందికేశ సదనంలోని ఖాళీ స్థలాన్ని వాహనాల పార్కింగ్కు అనువుగా తీర్చిదిద్దాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కార్తీక మాసం ప్రారంభం లోగా అక్కడి షెడ్లకు కూడా అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు.
ముందు జాగ్రత్తగా మొత్తం ఎలక్ట్రిక్ వైరింగ్ను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ షెడ్ల పరిధిలో మరిన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ చంద్రశేఖర శాస్త్రి, దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ జీ ఈశ్వర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి లోకేశ్, అసిస్టెంట్ ఇంజినీర్ సీతా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.