తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆదివారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కొవిడ్-19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
ఏడు పడగల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి. అయినా శ్రీనివాస మంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారికి విశ్రాంతి, సుఖనిద్ర ఇస్తున్నాడు. ఈ వాహన సేవలో జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.