తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన జ్యువెలరీ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బంగారు తాపడానికి సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించారు.
50 మంది స్వర్ణకారులు బంగారు తాపడం పనులు చేస్తున్నట్లు అధికారులు జేఈవో కు వివరించారు. స్వర్ణకారులకు అవసరమైన వర్క్ షాప్ లను మరిన్ని ఏర్పాటు చేయాలని సీఈకి సూచించారు. మొత్తం ఐదు వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం ద్వారా పనుల్లో వేగం పెంచవచ్చునని తెలిపారు. వివిధ దశల్లో జరుగుతున్న బంగారు తాపడం పనులను, రాగి ,ఇత్తడి సామగ్రి పరికరాలు ఉంచే గదిని జేఈవో పరిశీలించారు. అనంతరం పంచలోహ విగ్రహాల తయారీ విభాగాన్ని పరిశీలించారు.