శ్రీశైలం : శ్రీశైల క్షేత్ర భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి ( శ్రీపాదవల్లభుడు ) గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చనలు శాస్ర్తోక్తంగా జరిపించి భక్తులకు దర్శనాలు కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వస్తున్న యాత్రికులతో పుర వీధులన్నీ ఆధ్యాత్మిక సందడి మారాయి. గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలు పునః ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు దర్శన సమయంలో సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.
రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తుండగా ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలు కూడా భక్తులతో సందడిగా కనిపించాయి. ఇదిలా ఉండగా.. లోక కల్యాణం కోసం శివ ప్రణవ పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయ అంటూ కార్తీకమాసమంతా జరిగిన అఖండ శివచతుస్సప్తాహ భజనలు గురువారంతో ముగిసాయి. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చిన బృందాలు భజనమండలి వీరశిరోమండపంలో భజనలు చేశారు.
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నృత్య నివేదిన చూపరులను అలరించింది. హైదరాబాద్కు చెందిన ఈశ్వర్ కూచుపూడి కళాక్షేత్రం దుర్గా రాజేశ్వరి ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జరిగాయి. కళారాధనలో భాగంగా చిన్నారులు హారికాబాయి, నవ్యశ్రీ, ప్రజ్ఞశ్రీ, తర్ణిక, హర్షిత్, మోక్షిత్, లక్ష్మిసుదీప్తి తదితరులు ‘శివోహం’, ‘శివశంభో’, ‘శివ శివ శంకరా’ భక్తిగీతాలపై నృత్యాలను భక్తులను కట్టిపడేశాయి.