తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రంలో జనవరి నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ వెల్లడించింది. జనవరి 2 నుంచి 11వ తేదీవరకు వైకుంఠద్వార దర్శనం, జనవరి 2న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 3న స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి, శ్రీవారి చక్రసాన్నం వైభవంగా జరుపనున్నట్లు తెలిపారు. 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం, 7 నుంచి 13 వరకు ఆండాళ్ నీరాటోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
16న తిరుమలనంబి సన్నిధికి వేంచేపు, శ్రీ గోదాపరిణయోత్సవం, 28న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద, రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గల భక్తులు ఏటీసీ సర్కిల్ వద్ద, శ్రీవాణి టికెట్లు గల భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 మెయిన్ గేట్ వద్ద రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.