తిరుమల : తిరుమలలో విపత్తుల నివారణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులకు టీటీడీ సూచించింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో తిరుపతి జిల్లా, టీటీడీకి సంబంధించిన విపత్తుల నివారణ అనే అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యర్థి వర్చువ ల్ విధానంలో పాల్గొన్నారు. తిరుమలకు ప్రతి రోజు 80 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో లక్షలమంది భక్తులు వస్తుంటారని ఈవో వివరించారు.
తిరుమలలో తొక్కిసలాట, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధిక నష్టాన్ని నివారించడానికి, ప్రకృతి నుంచి ఎదురయ్యే సవాళ్లను సాధ్యమైనంత వరకు ఎదుర్కోవడానికి గల ప్రణాళికపై చర్చించారు. తిరుమలలో 7,500 వసతి గదులు, అనేక వాణిజ్య సముదాయాలు ఉన్నాయని ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగించే చోట ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టవలసిన చర్యలు తెలపాలన్నారు.
అకస్మాత్తుగా సంభవించే భారీ వర్షాలు, పిడుగుల వలన కొండ చరియలు విరిగిపడటం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నదన్నారు. వేసవి కాలంలో శేషాచల అడవులలో సంభవించే అగ్ని ప్రమాదాలు, వడగాలుల గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించడానికి ఎన్డిఎంఏ ఆధ్వర్యంలో ఎస్ఓపీ (స్టాండర్డ్ అప్రేటింగ్ సిస్టమ్) ను ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు.