శ్రీకాకుళం జిల్లా : తనను గుడ్డిగా విమర్శిస్తున్నవారికి అభివృద్ధి కనిపించదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు వస్తారా అని టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. చర్చకు పానకంలో పుడక వంటి అచ్చెన్నాయుడు కాకుండా నేరుగా చంద్రబాబు వస్తే బాగుంటుందన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న స్పీకర్.. బుధవారం మీడియా తనను కలిసినప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్ర మరింత వెనకబడిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సీఎం జగన్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టారని, ఇప్పటికే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు కేటాయించారని తెలిపారు. తమను ప్రతిపక్ష నేతలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, వీరికి తాము చేస్తున్న అభివృద్ది కనిపించదన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధిపై చర్చించేందుకు రావాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అయితే, అచ్చెన్నాయుడు వంటి పానకంలో పుడకలు కాకుండా డైరెక్ట్గా చంద్రబాబు చర్చకు రావాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో ఎవరు దద్దమ్మలో ప్రజలు తేలుస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి సరైన తీర్పునిస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఎవరు ఎలాంటి వారో, ఎవరు అవినీతి గడ్డి తిన్నారో ప్రజలకు బాగా తెలుసునన్నారు. టీడీపీ తన హయాంలో ఎన్నో పథకాల పేర్లు మార్చిందని ఆరోపించారు. దీనిపై తన వద్ద చాంతాడంత జాబితా ఉన్నదని తమ్మినేని పేర్కొన్నారు.