విజయనగరం : గత మూడేండ్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా వైసీపీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దుయ్యబట్టారు. అన్నింటికీ బటన్ నొక్కుతున్న జగన్ ప్రభుత్వం.. అభివృద్దికి మాత్రం బటన్ నొక్కడం లేదన్నారు. ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో బొత్స సత్యనారాయణ స్పష్టం చేయాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. విజయనగరంలో ఆయన ప్రజాపోరు సభలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు విజయనగరం వీధుల్లో పాదయాత్ర చేశారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నదని సోము వీర్రాజు విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టేందుకే వారి సమయం సరిపోవడం లేదు, ఇక అభివృద్ధి ఏం చేస్తారని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర సాగు జలాల కోసం తాము ఉద్యమం చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పుకుంటున్న మంత్రి బొత్స.. ఆ అభివృద్ధి ఏంటో వెల్లడించాలన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు కేవలం స్టిక్కర్ల ప్రభుత్వాలేనని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, ఇస్తే తామేంటో.. అభివృద్ధి ఎలా చేయవచ్చో చూపిస్తామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పేదల పొట్టగొడుతున్న వైసీపీకి ప్రజల చేతిలో ఘోరపరాభవం తప్పదన్నారు.