తిరుపతి : సంగీతం ప్రపంచానికి శాంతిని ప్రసాదించే సాఫ్ట్వేర్ అని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సంగీతం మనిషి మనసులో కాలుష్యాన్ని తొలగించి ఆత్మ విశ్వాసం పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలోని శ్రీ వినాయక స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కంచి స్వామి దర్శించుకున్నారు. కళాశాల విద్యార్థులు సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ .. 1993 తరువాత మరోసారి కళాశాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి అమృత ఝరి అని దీన్ని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకుని వెళ్లడానికి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాశీ నుంచి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించడానికి కంచిపీఠం ప్రయత్నిస్తుందని వెల్లడించారు. స్వార్థం లేని త్రికాల జ్ఞానం కలిగిన శాస్త్రం సంగీత శాస్త్రమని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ విద్య , వైద్యం జేఈవో సదా భార్గవి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, విద్యా విభాగం డిప్యూటీ ఈవో గోవింద రాజన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ విభీషణ శర్మ, కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.