హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలకమండలి లేని సమయంలో అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టారని తెలిపారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదని స్పష్టంచేశారు. ట్రయల్న్ విజయవంతం కాకపోవడంతో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. సంప్రదాయ భోజనంపై సోషల్మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. వాటిని భక్తులు నమ్మొద్దని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉచిత సర్వదర్శనాలపై అధికారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
వైభవంగా గోకులాష్టమి
తిరుమలలో గోకులాష్టమి వేడుకలను సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో పుణ్యాహవచనం అనంతరం గోగర్భం తీర్థం వద్ద కాళీయమర్థనునికి పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.