Tirumala | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో శ్రీవల్లి పుత్తూరు నుంచి తొలిసారిగా తెచ్చిన చిలకలతో చేసిన మాలలు, కిరీటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలో మొదట విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం జరిగింది. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్ద జీయ్యంగార్, తిరుమల చిన్న జీయ్యంగార్లు పఠించారు. వేడుకలో ఏలకులు, వట్టి వేరు, బాదం, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, చందనం, నల్ల ద్రాక్ష, రోజ్ పెటల్స్. తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు. టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. దాదాపు టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన దాత ఈ మాలలను విరాళంగా అందించారు.