గుంటూరు: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్మార్ట్ టౌన్షిప్లను అభివృద్ది చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) సిద్ధమవుతున్నది. పీపీపీ పద్ధతిలో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ది చేసి మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు ఏపీ సీఆర్డీఏ కార్యాచరణను తయారుచేసుకున్నదని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీపీపీ పద్ధతిలో స్మార్ట్ టౌన్షిప్ల నిర్మాణంపై విపులంగా చర్చించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఎంఐజీ టౌన్షిప్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక లేఅవుట్ను అభివృద్ధి చేయడానికి కనీసం 20 ఎకరాల స్థలం అవసరమని, అవసరమైన అనుమతులు పొంది, లేఅవుట్ను 200 చదరపు గజాలు, 150 చదరపు గజాల ప్లాట్లుగా విభజించి మధ్యవర్తిగా వ్యవహరించేలా సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుందన్నారు. మరో మూడు రోజుల్లో లేఅవుట్ ప్రకటన విడుదల చేయనున్నామని వెల్లడించారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల అభివృద్ధికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చి విజయవంతానికి సహకరించాలని వివేక్ యాదవ్ కోరారు.
ఈ సమావేశంలో ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సిద్దార్థ్, ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, డెవలప్మెంట్ ప్రమోషన్ మేనేజర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ఎంఐజీ ప్లాట్ల విక్రయంపై సీఆర్డీఏకు 3 శాతం, ప్రోగ్రాం మేనేజర్కి 1 శాతం, ప్రైవేట్ డెవలపర్లకు 96 శాతం ఆదాయం పీపీపీ పద్ధతిలో నిర్మించే టౌన్షిప్ల ద్వారా లభించున్నది.