తిరుపతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. పలు విషయాలను లోతుగా చర్చించిన మీదట పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ మీడియాకు వెల్లడించింది. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు : సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ప్రవేశపెట్టిన విధంగా త్వరలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలి. నడకదారి భక్తులకు టోకెన్లను జారీచేయాలి. ముంబైలో పదెకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. అక్కడ త్వరలోనే భూమిపూజ నిర్వహించి ఆలయం నిర్మాణం పనులను చేపట్టనున్నారు. టీటీడీ ఆస్థాన సిద్ధాంతిగా వెంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతి నియామకానికి పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వచ్చే నెల 5 వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలో రూ.3.61 కోట్లతో బంగారు సింహాసనాలు తయారు చేయించాలని పాలకమండలి నిర్ణయించింది. పద్మావతి మెడికల్ కాలేజీలో రూ.21 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతి మంజూరు చేశారు. శ్రీనివాస సేతు తొలి దశ పనులు పూర్తయినందున వచ్చే నెల 5 న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా రెండో దశ సేతు నిర్మాణం పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి నెలకల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఘాట్ రోడ్డులో పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు రెండు దశల్లో రూ.36 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వసతి గదుల మరమ్మతులకు రూ.19 కోట్లు కేటాయిస్తూ అనుమతించారు. స్వామి వారికి వస్తు రూపంలో విరాళాలు అందించేవారికి ప్రివిలేజెస్ అందించాలని నిర్ణయించారు.
బాలాజీనగర్లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మించేందుకు చర్చించారు. స్విమ్స్లో 300 పడకల క్యాన్సర్ విభాగాన్ని అభివృద్ధి పరచడంపై దృష్టిసారించాలి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా జమ్ములో శ్రీవారి ఆలయం నిర్మాణం పనులు పూర్తిచేయాలని తీర్మాణం చేశారు. అన్నమయ్య నడక మార్గం అభివృద్ధి పనులకు అనుమతులు రాలేదు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.