Srisailam | ఆధ్యాత్మిక తపోభూమిగా పిలిచే శ్రీగిరి క్షేత్రంలో శివానుగ్రహం కలిగిన ఆదిశంకరాచార్యుల భగవత్పాదుల వారు రచించిన శివానందలహరి అద్బుతమైన గ్రంధమని ప్రముఖ ప్రవాచకులు పంచసహస్రావధాని మేడసాని మోహన్ అన్నారు. కార్తీకమాసోత్సవాల్లొ భాగంగా దేవస్థానం ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన ఆయనకు ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. కళారాధన వేదిక వద్ద జ్యోతిప్రజ్వలన చేసి మేడసాని మోహన్ ప్రవచన కార్యక్రమం ప్రారంభించారు.
మంగళవారం సాయంత్రం కళారాధన వేదికపై ఆయన ప్రవచనాలను వినేందుకు వందలాదిగా వేచిఉన్న భక్తులకు మేడసాని మోహన్ పలు ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. ప్రధానంగా ఎంతో ప్రసిద్ది చెందిన శివానందలహరి – భక్తితత్తం రెండింటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని విపులీకరించారు. గ్రంధంలోని ప్రతి అంశంతో శివున్ని స్మరించడంలో ఉండే ఆనందం ప్రవాహమై పారుతుండేలా ఉంటుందని, అందుకే శివానందలహరిగా ఆదిశంకరాచార్యులవారు సామాన్య మానవాళికి అందించారని చెప్పారు..
లహరి అంటేనే ప్రవాహమని… ఈ గ్రంధంలో శివతత్తం, భక్తితత్తంతో ముక్తిని పొందే మార్గాలను మేడసాని మోహన్ వివరించారు. ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు మందుగానే క్షేత్రానికి చేరుకున్నారని శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్ కుమార్ తెలిపారు.