అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు ‘‘ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’’ పథకాన్ని అమలు చేశామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. అయితే ఈ పథకానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు పెట్టుకోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’’ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్ డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. బీసీ, మైనారిటీ విధ్యార్థులకు ‘‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ’’ పథకం కింద రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశామని పేర్కొన్నారు.
మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని వెల్లడించారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.